21 Feb 2012

తేనెలూరు తెలుగు


హోం > గుంటూరు జిల్లా


నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
అమ్మదనం నిండిన ది.. అమృతం కురిపించేది.. తేనెధారలా కమ్మనైనది..
తెలుగు భాష. మన ఆ మాతృభాష ఇప్పుడు మృతభాష అవుతోంది. ‘మమ్మీ డాడీ’
 పిలుపుల మధ్య ‘అమ్మానాన్న’లోని మాధుర్యాన్ని మరిచిపోతున్నాం.
ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేవారు 18 కోట్ల మంది ఉన్నారనే నిజం
గొప్పగా చెప్పు కొనేందుకే పరిమితమవుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, తలిదండ్రుల
అలసత్వం వెరసి తెలుగు భాష పరిరక్షణలో అంతా విఫలమవుతున్నాం.
తెలుగు వెలుగులను ఆరిపోనీకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నేడు. ఈ సందర్భంగా

ప్రత్యేక కథనం..
అమ్మ భాష.. అమృతం కన్నా తీయనైన భాష తెలుగు. అందుకే దానిని దేశ
భాషలందు లెస్స అని కీర్తించారు శ్రీకృష్ణదేవరాయలు. తేనె కంటే తీయనిదని
కొనియాడారో కవి. తెలుగుభాష కీర్తిని ఎందరో మహానుభావులు తమ కవితా
సంకలనాల్లో వేనోళ్లా పొగిడారు. ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు
ఆధునికకాలంలో తన ప్రాభావాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : మాతృభాషపై మమకారం పెంచుకున్న
ఎందరో మహనీయులు తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు.
ప్రస్తుతం తెలుగునేలపై మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు
ఎదురయ్యాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే
 పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో
జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం
పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లోఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల
గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు
మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో
చట్టం చేశారు. అధికార భాషా సంఘం ఏర్పడినా రాజకీయ నాయకుల అలసత్వం,
అధికారుల స్వార్థం కారణంగా తెలుగుభాషకు తీరని అన్యాయం జరుగుతోందని
పలువురు ఆరోపిస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ
ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోవడం లేదు.

ఏటా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నా అధికారభాషగా తెలుగుకు
కలిగిన ప్రయోజనం శూన్యం. పాఠశాల స్థాయిలోనే భాషకు పునాది వేయాల్సిన
పరిస్థితుల్లో మాతృభాషపై విషబీజాలు నాటుతూ ఆంగ్లంపై ఎక్కడలేని మమకారం
చూపుతూ చివరికి మాతృభాషనే దూరం చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
 ప్రపంచవ్యాప్తంగా రాణిం చేందుకు ఆంగ్ల భాష ఎంత అవసరమో, సమాజంలో
మనిషిని మనిషిగా తీర్చిదిద్దేందుకు మాతృభాష అంతకు మించిన అవసరం.
తెలుగుభాషకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు
తెరవాల్సిన అవసరం ఉందని భాషా ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ
 మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు భాషా ప్రియులు,
భాషోద్యమ నేతలు తమ అభిప్రాయాలు ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.

ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి..
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నట్లుగా రాష్ట్రంలో తెలుగు
భాషకు మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల తెలుగుకు సంబంధించిన సమస్యలు
ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. విద్యా, పరిపాలనా రంగాల్లో
తెలుగుకు ప్రభుత్వ సహకారాన్ని పొందడానికి తగిన అధికార వేదిక మంత్రిత్వ
శాఖతోనే సాధ్యమవుతుంది.
-డాక్టర్ వి.సింగారావు, కోశాధికారి, రాష్ట్ర తెలుగు భాషోద్యమ సమాఖ్య

విషబీజాలు నాటుతున్నారు..
భాషకు పునాది వేయాల్సిన విద్యాసంస్థల్లోనే తెలుగు భాషపై విద్యార్థుల మనసుల్లో
విషబీజాలు నాటుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో పట్టులేని వారు
ఇతర భాషల్లోనూ రాణించలేరనే సత్యాన్ని తల్లిదండ్రులు సైతం గుర్తించాలి.
-వి.విజయ్‌కుమార్, కోశాధికారి, ఆర్‌యూపీపీ జిల్లా శాఖ

తెలుగు భాషను పరిరక్షించాలి..
ప్రపంచదేశాల్లో తెలుగు భాష మాట్లాడే ప్రజలు 18 కోట్ల మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో
దాని పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. భాషా సంస్కృతుల
పరిరక్షణకు సభా సంఘాన్ని శాశ్వత స్థాయిలో ఏర్పాటుచేసి తెలుగు భాషను
పరిరక్షించాలి.
-పెద్దిశెట్టి భవాని, మహిళా కార్యదర్శి, ఆర్‌యూపీపీ జిల్లా శాఖ

తెలుగులో మాట్లాడితే నేరమా..
ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి
 విద్యార్థులను శిక్షించడం అలవాటుగా మారింది. వివిధ ప్రాంతాల మాండలికాలు,
 యాసలను హేళన చేస్తూ వక్రీకరిస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతిపై గౌరవాన్ని
 పెంపొందించే ప్రత్యేక చట్టం తేవాలి.
-డాక్టర్ పాకనాటి సూర్యకుమారి, తెలుగు అధ్యాపకురాలు

తెలుగు బోధన తప్పనిసరి
ప్రాథమిక విద్య తెలుగులోనే బోధిస్తే పిల్లలకు భాషపై అభిమానం ఏర్పడుతుంది.
హైస్కూల్ విద్యలో సైతం తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరి చేయాలి.
ఇంటర్ మొదలు, పీజీ, సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లోనూ తెలుగును తప్పనిసరి
చేస్తూ ప్రభుత్వం చట్టం చేయాలి.
-నాగభైరవ ఆదినారాయణ, జిల్లా అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య

No comments: